జనసేనలోకి గ్రేటర్ విశాఖ వైసీపీ కార్పోరేటర్లు
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో చేరిక
అమరావతి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్కి చెందిన పలువురు వైసీపీ కార్పోరేటర్లు జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రేటర్ విశాఖ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు, గాజువాక 74వ డివిజన్ కార్పోరేటర్ తిప్పల వంశీరెడ్డి, గ్రేటర్ విశాఖ వైసీపీ యువజన విభాగం నాయకుడు ఆళ్ల శివ గణేష్తో పాటు ఆయన అనుచరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు. 91, 92 డివిజన్ల కార్పొరేటర్లు కుంచె జ్యోత్స్న, బెహరా స్వర్ణలత శివదేవి జనసేనలో చేరుతున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంగ దుర్గా ప్రశాంతి పాల్గొన్నారు.