వైద్యుల రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్ లో ఎన్ఎంసీ ప్రకారం ఏపీఎంసీ నిబంధనలు పాటించాలి

channel18
0

 విజయవాడ,

01-04-2025.

                 వైద్యుల రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్ లో ఎన్ఎంసీ ప్రకారం ఏపీఎంసీ నిబంధనలు పాటించాలి


పవిత్రమైన వైద్య వృత్తిని స్వీకరించిన నాడు చేసిన ప్రమాణం ప్రకారం వైద్యులు నడుచుకోవాలి

సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించాలి.. సాధారణ కాన్పులకు ప్రాధాన్యమివ్వాలి

నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులకు అభినందనలు

- సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమం మరియు వైద్య విద్య మంత్రి.

         వైద్యో నారాయణో హరి అన్న నానుడిని నిజం చేస్తూ వైద్యులు నైతిక విలువలకు కట్టుబడి పనిచేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమం మరియు వైద్య విద్య మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం మంగళవారం వేడుకగా జరిగింది. ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిధిగా హజరయ్యారు.  ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా డాక్టర్ జి. సుజాత, డాక్టర్ కె. వెంకట సుబ్బనాయుడు, డాక్టర్ డి. శ్రీహరి, డాక్టర్ స్వర్ణ గీత, డాక్టర్ ఎస్. కేశవరావు బాబు, డాక్టర్ సి. మల్లేశ్వరీ ల చేత మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ వైద్యుల రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్ లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. వైద్యులు తమ సర్టిఫికెట్లను ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేయించుకోవాలని, ఈ నిబంధన ఖచ్చితంగా అమలు  చేయాలన్నారు. దీంతో వైద్యుల పనితీరుపై పర్యవేక్షణ పెరుగుతుందన్నారు. విదేశాల్లో ఉన్న  వైద్యుల విషయం లో కొంత సమస్య ఉన్నప్పటికీ వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. వైద్యులు నైతిక విలువలు పాటించాలని, అవసరం ఉన్నా లేకపోయినా యాంటిబయోటిక్స్ వాడించడం, టెస్ట్ లు పేరుతో రోగులు ఆర్థికంగా చితికిపోయేలా వ్యవహరించకూడదన్నారు. నేడు వైద్య వృత్తి  వ్యాపారమైందన్న విమర్శలకు చెక్ పెట్టాలని కోరారు. పవిత్రమైన వైద్య వృత్తిని స్వీకరించిన నాడు చేసిన ప్రమాణం ప్రకారం వైద్యులు నడుచుకోవాలని వైద్యులకు మంత్రి సూచించారు. అయితే కొంత మంది రోగులు, వారి బంధువులు ఎక్కువ టెస్ట్ లు రాసి, ఎక్కువ మందులు రాసిన వారే మంచి వైద్యులన్న ఆలోచన లో ఉన్నారని, వారు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు.  నేటి కాలంలో సిజేరియన్ ఆపరేషన్లు పెరిగిపోయాయని, అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని నార్మల్ డెలివరీలు జరిగేలా వైద్యం అందించాలన్నారు. ఏపీఎంసీలో మొత్తం 23 మంది సభ్యులు ఉంటారని,  నలుగురు ఎక్స్ అఫిషియో మెంబర్లు, 13 ఎలక్టెడ్ మెంబర్లను ఎన్నుకోవాల్సి ఉందన్నారు. అలాగే మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక కూడా జరగాల్సి ఉందన్నారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ గోగినేని సుజాత, డాక్టర్ కాల్వకొల్లు వెంకట సుబ్బ నాయుడు, డాక్టర్ దుగ్గమాటి శ్రీహరిరావు, డాక్టర్ స్వర్ణ గీత, డాక్టర్ ఎస్. కేశవరావుబాబు, డాక్టర్ చుండూరి మల్లీశ్వరి లను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఇన్ చార్జి వైస్ ఛాన్సలర్ డి.ఎస్.వి.ఎల్. నరసింహం, ఏపీఎంసీ రిజిస్ట్రార్ రమేష్ రెడ్డి, ఎన్టీయర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధికా రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. 

జారీ చేసినవారు : సంచాలకులు, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">